ఉపాధ్యాయుని బాధ్యత కేవలం తరగతి సిలబస్ ను అనుసరించి పాఠాలు బోధించడం మాత్రమే కాదు. విద్యార్ధుల పట్ల గురుతరమైన బాధ్యత మనకు ఎంతోవుంది. విద్య ప్రధాన లక్ష్యం ఙ్ఞానసముపార్జనే అయినప్పటికీ, పాఠ్యాంశాల తాత్వికత ద్వారా క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశ భక్తి, మానవ సంబంధాలు విద్యార్థి తన తరగతి అభ్యసనలోనే మెరుగుపరచుకోవాలి. నేడు మనకు అత్యాధునిక సాంకేతిక విఙ్ఞానం అందుబాటులో ఉండి, ఎన్నో సౌకర్యాలను అందిస్తూ మనల్ని ప్రభావితం చేస్తోంది. సాంకేతిక విఙ్ఞానంతో పరుగులు తీస్తున్న మన చిన్నారులు సరియైన దిశలో ప్రయాణించలేకపోతే మానవతా విలువలు, సంబంధాలు పూర్తిగా మరుగున పడిపోయే అవకాశం ఉంది. నేటి పోటీ ప్రపంచంలో మంచి మార్కులు, గ్రేడులు, ర్యాంకులకోసం ఒత్తిడికి గురై ఎంతో శ్రమిస్తూ ఫలితాలను అందుకుంటున్న మన విద్యార్ధులు మానవతా విలువలు, మానవ సంబంధాలు, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణలో వెనుకంజ వేస్తున్నారు. ప్రాథమికస్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు బోధించే గురువులందరు ఈ విషయాలపట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా భాషోపాధ్యాయులు ఇటువంటి అంశాలను తమ బోధనలో మేళవించి అమలుచేయటం సముచితం. అందుకే మాతృభాషాబోధకుడిగా నా చేతనైన ప్రయత్నం చేసి, తోటి పండితులకు, చిన్నారులకు, తల్లిదండ్రులకు, పూర్తిస్థాయి సహకారం అందించాలని, తెలుగు బోధనోపకరణాలకు ఎవ్వరు ఇబ్బంది పడకూడదని "అక్షరార్చన" చేస్తున్నాను.
మన ప్రాచీన సాహితీ సంపదను, సంస్కృతీ సంప్రదాయాలను మీ అందరిద్వారా మరెందరికో అందించే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగువాడిగా జన్మించినందుకు గర్విస్తూ, మన భాష, సంస్కృతీ పరిరక్షణలో భావి తరాలకు వరంగా "అక్షరార్చన" కాగలదని విశ్వసిస్తు, నిరంతరం మీ సహకారం కోరుతు, మీకు తెలిసిన విలువైన అంశాలను ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తారని ప్రార్ధిస్తూ.......జోస్యుల.
⚡⚡⚡ FLASH NEWS ⚡⚡⚡