ఒక జాతి ప్రజల యొక్క సంభాషణలలో స్థిరపడిపోయిన కొన్ని పదబంధాలకు 'జాతీయాలు' అని పేరు. ఇవి జీవితానుభవాల నుండి పుట్టి, ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే మాటలు. భాషకు, సంస్కృతికి ఇవి దర్పణం వంటివి.వీటిని ఆంగ్లంలో 'ఇడియమ్స్' అంటారు.
శబ్దపల్లవాలకు వలె విడిగా వేరువేరు అర్థాలు ఉన్నప్పటికీ కలిపి చెప్పినపుడు మరొక విశిష్టమైన భావాన్ని తెలియజేస్తాయి. ఇందులో నిగూఢమైన అర్థం ఉంటుంది. మాతృభాషగా కలవారికి మాత్రమే వీటి విలువ తెలుస్తుంది. పల్లెప్రజలే ఎక్కువగా తమ మాటల్లో ఈ జాతీయాలను ఉపయోగిస్తారు. భోజనానికి 'వడియం' వలె భాషకు 'ఇడియం' కమ్మదనాన్ని చేకూర్చుతుంది.
ఒక్కోసారి జాతీయాన్ని సామెతగాను, సామెతను జాతీయం గాను పొరపాటు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇవి రెండూ వేరువేరు. సామెతలో అర్థం సంపూర్ణం. జాతీయంలో అర్థం అసంపూర్ణం. ఇది వాక్యం మధ్యలో ఉండి ఉన్నతమైన భావాన్ని ఇవ్వడమే కాకుండా భాషకు సొగసును, పరిపుష్టిని చేకూరుస్తాయి. ఇవి భాషకు ఆభరణాలు.
జాతీయాలను సేకరించి ప్రచురించినవారిలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, బూదరాజు రాధాకృష్ణ గారు, నేదునూరి గంగాధరం గారు ప్రముఖులు.